Friday, May 16, 2025

 
ధర్మాన్ని గుర్తించడమంటే "మతం" మత్తులో మునిగిపోవడమా?

What is the Dharma?: డియర్ లీడర్స్ పై ప్రశ్న అందరికీ వింతగా అన్పించవచ్చు... కాని నేటి సమాజంలో 100% ఇదే జరుగుతుంది.

నిజానికి అసలు ధర్మాని గుర్తించడమంటే ఏమిటో తెలుసుకోవాలి?

పండితుల భాష్యం ప్రకారం ధర్మమంటే "ఈశ్వరాజ్ఞ" అంటే దైవ ఆదేశాలను పాటించడం. ఎవరైతే మనల్ని పుట్టించి పోషిస్తున్నాడో, అటువంటి పంచేంద్రియాలకు అతీతమైన శక్తిని గుర్తించి అతనిని మాత్రమే ఆరాధిస్తూ, అతని స్మరణతోనే జీవితాన్ని గడిపే విధానాన్ని ధర్మము అంటారు.

ఇది ప్రతి ధార్మిక గ్రంధాలలోనూ నిక్షిప్తమై ఉంది. దానిని గుర్తించడమే ధర్మము. వేదోపనిషత్తులు, బైబిల్, ఖురాన్ గ్రంధాలలో నిజమైన దైవభావన, ధర్మమూ దాగి ఉన్నాయి. బయట సమాజంలో జరుగుతున్న విశ్వాసాలకు, ఈ గ్రంధాలకు ఏమాత్రం సంబంధం లేదు.

మనిషి తను క్రియేట్ చేసుకొన్న మతము కోసం, తమ జాతి ఉద్ధరణ కోసము, స్వలాభమూ, స్వార్ధంతో నిండిపోయి ధర్మం యొక్క రూపు రేఖలు మార్చుతున్నాడు. తమ అభిప్రాయాలను, ఆలోచనలను చొప్పించి విభిన్న గ్రూపులుగా విడగోట్టేసాడు. తను క్రియేట్ చేసిందే ధర్మం, మిగతాదేది కాదనే ఒక చక్రం తయారు చేసుకుని దానిలోనే తమ గ్రూపులను, సంఘాలను నియమించుకుంటూ పోతున్నాడు.తద్వారా ధర్మం ముసుగులో "మతాలు" ఏర్పడి రాజ్యం చేస్తూ జాతి సమైక్యతను, సౌభ్రాతత్వాన్ని నాశనం చేస్తూ మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి.

"మతం కంటే మానవత్వం గొప్పది" అనే భావన నేటి సామాజికంలో మొదలైందంటే "మతం" ఏవిధంగా విరుచుకుపడుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు. మతం వలన మానవత్వం దూరమవుతుందని ఇట్టే గ్రహించవచ్చు

ఇక అసలు విషయానికొద్దాం!

ధర్మాన్ని గుర్తించడమంటే "మతం" మత్తులో మునిగిపోవడమా? అంటే నేటి భక్తులు లేక విశ్వాసులు ఇదే భ్రమలో బతుకుతున్నారు... ధర్మాన్ని గుర్తించాము... స్వీకరించామని చెబుతూ ఆయా మతాల మత్తులోకి వెళ్లి పోతున్నారు.
ఎంతలాగ అంటే తన సంస్కృతిని, వేషధారణను మార్చేసుకుంటున్నాడు. తన మాతృభాషను సైతం అవహేళన చేసే స్థాయికి దిగజారిపోయారు. తను పుట్టి పెరిగిన జాతిని సైతం వదులుకుని... ఒక రకంగా చంపుకుని బ్రతుకుతున్నారు. మన పేర్లు, వేషధారణ, ముఖ్యంగా జాతిని నిర్దేశిస్తాయి. వీటినే మార్చేసుకుంటున్నాడంటే... ఇక తమ జాతి అతని దగ్గర ఎలా ఉంటుంది?

ఇది ఎలా ధర్మమయింది?

దేవుడు తనకంటూ ఒక భాషను, వేషధారణను, సంస్కృతిని ప్రవేశ పెట్టాడా అంటే లేదు. అటువంటప్పుడు ధర్మ స్వీకరణ పేరుతో వీళ్ళు చేస్తున్నదేమిటి? మతం మత్తు కాదంటారా? ఇవన్ని ధర్మ ప్రచారం పేరుతో సాగుతున్న వికృత చేష్టలు కావా?.

ధర్మాన్ని ధర్మంగా ప్రచారం చేయడం మానివేసారు. ప్రతి ఒక్కరూ తమ జాతుల కోసం సంఘాల కోసం ధర్మ ప్రచారం ముసుగులో సంస్కృతులను రూపు మాపుతూ, జాతులను విచ్చిన్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం ధర్మప్రచారం కాదు! ఈ విధానం దేశ సమైక్యతను సర్వనాశనం చేసేదే!

నిజానికి ధర్మ ప్రచారమంటే ఏమిటి?

నిజమైన ధర్మప్రచారం "నిజదేవుని ఉనికి తెలియజేయడమే!.. మన అందరి దేవుడు ఒక్కడే.. ఆయననే వేడుకొందాము... ఆయన విషయంలో మనమందరమూ కల్సి మెలసి ఉందాము" ఇంతవరకే తప్ప వాళ్ళ సంస్కృతిని రూపు మాపాలని చూడటం, మీ జాతులలోకి కల్పేయాలని చూడటం కోసం పేర్లు మార్చి, ఒంటి మీది గుడ్డలు మార్చేయాలని చూడటం మహా భయంకరమైన దారుణం. ఆఖరికి వాళ్ళు మాట్లాడే భాష మాట్లాడకపోతే పూర్తి విశ్వాసంలోకి రానట్లే అనే స్థాయిలోకి వచ్చేస్తున్నారంటే ఇది ధర్మప్రచారమవుతుందా?

అందరూ ఈ భాషనే పేర్లుగా పెట్టుకోవాలి అనడానికి దేవునికి భూమి మీద ప్రత్యేక భాష ఏమైనా ఉందా లేదు కదా?
ఇంకా స్పెషల్ యూనిఫాం ఏమైనా పెట్టాడా? అదీ లేదు... ప్రతి జాతికి ఒక భాష, వేషదారణ, తిండి, జీవన సంస్కృతీ అక్కడ నివసించే వాతావరణాన్ని బట్టి ఏర్పడతాయి... మంచు పర్వతాలలో ఉండేవారికి ఒకలా, ఎడారుల్లో జీవించేవారికి ఒకలా ఉంటాయి.. వీటిని మార్చడం కుదరదు. ఇవన్నీ దేవుని యొక్క సృష్టితాలు... వీటిని మార్చే ప్రయత్నం పూర్తీ ప్రకృతి విరుద్ధం. కాబట్టి అందరి దేవుడూ ఒక్కడేనన్న నినాదం తప్ప మరొకటి ప్రచార అంశం కాదు... వేడుకునేవాడు తనకిష్టమైన రీతిలో...లేక తన దగ్గరున్న శాస్త్రపరంగా వేడుకుంటాడు...

"అందరి దేవుడూ ఒక్కడేనన్న నినాదం " మనుషులను దగ్గర చేస్తుంది... జ్ఞానాన్ని పెంపొందిస్తుంది. దీనిపై అన్ని శాస్త్రాలను అధ్యయనం చేసేలా ప్రేరేపిస్తుంది. దీనికి మించి ముందుకెళ్ళి మా మతాన్ని స్వీకరించు, మా ప్రార్ధనా విధానం పాటించు, మా పద్ధతులలోకి వచ్చేయండి అనే ప్రచారం వ్యతిరేకతకు, అజ్ఞానానికి, మత మౌడ్యాలకు దారి తీస్తుంది.
విచిత్రమేమిటంటే నేటి ప్రచారకులు అసలు విషయాన్ని వదిలి వేసి తమ మత పద్దతులు ప్రచారం చేయడంలో మునిగిపోయారు.

ధర్మాన్ని స్వీకరించామనే భ్రమలో వాళ్ళ మతాల మత్తులోకి వెళ్ళిపోతున్నారు!

ఇక ధర్మం స్వీకరించాము అనే వారి ఆలోచనలు మరీ విచిత్రంగా మారిపోతున్నాయి.. అటువంటి వారు ఎంతటి అజ్ఞానంలో కూరుకుపోతున్నారంటే... ఎప్పుడైతే ఎదుటివారి మతాన్ని స్వీకరించారో అక్కడ నుండి ఇంతకి ముందు నుండి ఇతని దగ్గర ఉండే గ్రంథాలు పనికిరానివి అయిపోతాయి. ఇక్కడి పుణ్యపురుషులు అవిశ్వాసులు అయ్యిపోతారు.. వాళ్ళ పేర్లు పెట్టుకుంటే విశ్వాసం కోల్పోయినట్టేనట... ఎంత దారుణం?

ఉదాహరణకు కొన్ని విషయాలు చూద్దాము!
ఒక వ్యక్తీ ఏవో కొన్ని బోధనలు అంగీకరించి, నచ్చి నేటి ఇస్లాం స్వీకరించాడు... అతని చేత అన్ని తమ మతానికి అనుగుణంగా మార్చేసుకోవాలి అని ప్రేరేపిస్తారు... ఇతని పేరు తీసేసి అరబీ పేర్లు తగిలించేసుకోవాలి. ఇక్కడి పుణ్యపురుషులు ఎందుకూ పనికిరారు... కానీ ఎక్కడో అరబీ దేశంలో ఉండే ఇతనికి అసలు ఏమాత్రం సంబంధం లేని పుణ్యపురుషులను పొగడాలి. .(ప్రపంచంలో గొప్పవారు ఎక్కడున్నా వారి చరిత్ర అధ్యనం చేయడం, తెలుసుకోవడం, నలుగురికీ చెప్పటం తప్పుకాదని నా ఉద్దేశ్యం... ఇక్కడి పుణ్యపురుషులను దూషించి, విమర్శించి ఎక్కడో ఉన్నవారిని పొగిడే విధానం తప్పు!) వీడి పరిస్థితి ఎంతవరకూ దిగజారిందంటే ఆఖరికి ఎక్కడ అరబీ పేరుతో ఎవడు కనిపించినా వాడే అతని జాతి అనే స్థాయికి వచ్చేసాడు... ఇతనికి అతని బంధువులు, చుట్టాలు పరాయి వాళ్ళు అయిపోయారు. వాడికి అరబీ పేరు ఉంటే చాలు సమర్ధించడం.. పొగడటం వరకూ వెళ్ళిపోయాడు... ఈ పిచ్చి చివరికి దేవుణ్ణి వదిలి వాళ్లకి ఊడిగం చేసే స్థాయికి వెళ్ళిపోయింది

ఇదే విధానం క్రైస్తవ ప్రచారంలో జరుగుతుంది... మరీ విచిత్రం ఏమిటంటే ఈ మతం మొత్తం ఏమాత్రం వాస్తవికతకు దగ్గరగా లేదు అన్ని కూడా కల్పిత బోధనలు, కల్పిత విశ్వాసాల పునాదిపై నడపబడుతున్న మతం... నిజం చెప్పాలంటే కొంతమంది ఇస్లాం ప్రచారకుల్లో "ఏక దైవం" పట్ల భావన, విశ్వాసం, ప్రచారం మెండుగా ఉన్నాయి... దైవ అస్తిత్వాన్ని పరిచయం చేయడంలో క్లారిటీ ఉంది..మిగతా విషయాలు పక్కన బెడితే!

కానీ క్రైస్తవంలో ఏ కోశానా "ఏక దైవ భావన" లేనే లేదు.. యేసు బోధనలు పూర్తిగా వదిలి పెట్టేసారు. అయినప్పటికీ వీళ్ళలో పేర్లు మార్చేయడం, ఇక్కడి పుణ్యపురుషులను దూషించి, ఇక్కడి గ్రంధాలను అవహేళన చేయడం తారా స్థాయికి వెళ్ళిపోయింది.

ఇటువంటి ప్రచారాలు జాతి సమైక్యతను దెబ్బతీయడమే కాదు... నిజ దేవుని యొక్క నమ్మకాన్నే నాశనం చేస్తున్నాయి. దీని కారణంగా మత విద్వేషాలు, మత దూషణలు పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ మతాల కోసం కొట్టుకుంటున్నారు తప్ప... నిజమైన ధర్మాన్ని వదిలి చాలా దూరం వెళ్ళిపోయారు

నిజమైన ధర్మాన్ని స్వీకరించడమంటే...

అందరికీ దేవుడు ఒక్కడే! ఈ విషయాన్నే అన్ని ధార్మిక గ్రంథాలు ప్రబోధిస్తున్నాయి. ఆ ఒక్కడిని గుర్తించి వేడుకోవడమే ధర్మం... మీరు ఈ పద్ధతిలోనే వేడుకోవాలి అనే నియమం ఏమీ లేదు... ఆ ఒక్కడిని నమ్ముతున్నావా లేదా? అనేదే ముఖ్యం. దేవుణ్ణి రెండు చేతులతో అర్దిస్తున్నప్పుడు ఆయన వదిలి పెట్టే ప్రసక్తే లేదు.

ఇక ప్రచారమంటే... కేవలం ఆ నిజ దేవుని ఉనికిని, గొప్పతనాన్ని, నమ్మకాన్ని కలుగజేయడమే తప్ప ప్రచారకుల ఆచార పద్దతులు రుద్దే అవకాశం లేదు.

మీ దేవుడూ, మాదేవుడూ ఒక్కడే ఆయన వైపునకే తిరుగుదాము.. ఇదే ప్రచార సూత్రం.

ప్రతి జాతికి వారి ఆచార పద్ధతులు వారికున్నాయి... వాటి జోలికెళ్ళే అధికారం ఎవరికీ లేదు.. భగవంతుణ్ణి గుర్తించిన ప్రతివాడు తమ ఆచార పద్ధతులను శుభ్రపర్చుకుంటాడు.

కాబట్టి మిత్రులారా ధర్మాని ధర్మంగా గుర్తించండి. మతం మత్తులోకి వెళ్ళిపోయి నాశనం కాకండి! జైహింద్!!
....................................................... 
(ధర్మం యొక్క పూర్తి వాస్తవికత మరొక పోస్టులో అందిస్తాను)

Topics

Recent Posts